జీవనకళ : విపశ్యన ధ్యానము

ఈ క్రింద ఇవ్వబడిన విషయానికి మూలం శ్రీ గోయెంక గారు స్విట్జర్లాండ్ లోని బెర్న్ లో ఇచ్చిన ప్రసంగం.

ప్రతి ఒక్కరూ శాంతిని, సామరస్యాన్ని కోరుకుంటారు, ఎందుకంటే మన జీవితంలో ఇవి లేవు కనుక. ఎప్పటికప్పుడు మనమందరం ఆందోళనను, చికాకుని, సామరస్యం లేకపోవటాన్నీ అనుభవిస్తూ ఉంటాము. అలా వీటితో బాధపడుతూ ఉన్నప్పుడు, మనం వాటిని మనవరకే పరిమితం చేసుకోకుండా, తరచూ ఇతరులకు కుడా వాటిని పంచుతుంటాము. ఆ బాధ అనేది మన చుట్టూ ఉన్న వాతావరణంలోకి విస్తరిస్తుంది; మన పరిచయంలోకి వచ్చిన వారందరినీ కూడా ప్రభావితం చేస్తుంది. ఖచ్చితంగా ఇది నేర్పరితనంతో గడిపే జీవనమైతే కాదు.

మనం శాంతిగా జీవించాలి మరియు ఇతరులతో కూడా శాంతియుతంగా ఉండాలి. మానవులు సంఘ జీవులు, సమాజంలో ఒకరితో ఒకరు కలసిమెలసి ఉండవలసి ఉంటుంది. కాని మనం శాంతి సామరస్యంగా ఎలా జీవించాలి? ఎలా మన చుట్టూ అలాంటి వాతావరణమే నెలకొల్పి ఇతరులు శాంతిసామరస్యాలతో జీవించేలా చేయాలి?

మన కష్టాల నుండి ఉపశమనం పొందటానికి, దానికి మూల కారణం - దుఃఖానికి కారణం తెలుసుకోవాలి. మనం సమస్యను లోతుగా పరిశీలిస్తే , మన మనసులో ప్రతికూల భావన లేదా కల్మషం జనింపచేసుకున్న ప్రతిసారి మనం దు:ఖితులమవుతామని స్పష్టం అవుతుంది. మనసులో వికారాలు, మానసిక అపవిత్రత లేదా కల్మషం ఉన్నప్పుడు, శాంతి, సామరస్యాలు ఉండలేవు.

మన మనస్సులో వికారాలు, వ్యతిరేకభావాలు ఎలా తలెత్తుతాయి? బాగా పరిశీలించి చూస్తే అర్థమౌతుంది. ఎవరైనా మనకు నచ్చని విధంగా ప్రవర్తించినా, మనకు అయిష్టమైనా విషయాలు ఏవైనా జరుగుతున్నా మనం దుఃఖానికి గురి అవుతాము. మనకు జరగకూడదని జరుగితే అశాంతి కలుగుతుంది. కోరుకున్నవి జరగకపోవచ్చు, అడ్డంకులు ఎదురవ్వవచ్చు. అప్పుడు మళ్ళీ అశాంతిని కలుగజేసుకుంటూ, మన లోపల బంధనాలు, ముడులూ వేసుకుంటూపోతాం . జీవితాంతం ఇలా అయిష్టమైనవి ఏవో జరుగుతూనే ఉంటాయి. ఆశించినవి జరగవచ్చు, జరగకపోవచ్చు. ఈ విధంగా ప్రతిక్రియ చేసి ముడులను వేసుకునే అలవాటు మన మొత్తం శారీరిక, మానసిక జగత్తును అశాంతి, అలజడి, కలత, వ్యతిరేక భావాలతో నింపివేస్తుంది. దీనితో జీవితం దుః:ఖమయమవుతుంది.

జీవితంలో మనం కోరుకున్న విధంగానే అన్ని జరిగేటట్లూ, మనకు అయిష్టమైనవి ఏవి జరగకుండా వుండేటట్లూ చేయగలగటం ఈ సమస్యకు ఒక పరిష్కారం. మనకు అయిష్టమైనవి జరగకుండా, ఇష్టమైనవే జరిగే విధంగా చేయటానికి అవసరమైన అధికారం మనకు ఉండాలి లేదా మనకు సహాయపడగలిగే వారెవరి వద్దనైనా ఈ అధికారం ఉండాలి. కానీ ఇదంతా సాధ్యమయ్యే పని కాదు గదా! కోరుకున్నవి కోరుకున్నట్లే జరగటం, కోరిన కోరికలన్నీ తీరటం, అయిష్టమైనది ఏమీ జరగకుండా ఉండటం - ఇలా ప్రపంచంలో ఎవరికీ జరగదు కదా! మన ఇష్టాలకు, కోరికలకు వ్యతిరేకంగా ఏవేవో జరుగుతూనే ఉంటాయి. కాబట్టి "అయిష్టమైనవి జరిగినప్పుడు గుడ్డిగా ప్రతిస్పందించి అశాంతిని కలుగజేసుకోకుండా, శాంతిసామరస్యాలతో ఉండటం ఏ విధంగా సాధ్యమవుతుంది?" అనే ప్రశ్న ఉదయిస్తుంది.

మనదేశంలోనూ, ఇతర దేశాలలోను ప్రాచీన కాలం నుండి మహాపురుషులు, ఋషులు మానవుని దుః:ఖానికి, అశాంతికి సంబంధించిన ఈ సమస్యను పరిశీలించి దానికి ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు. దీని ప్రకారం అయిష్టమైనది ఏదైనా జరిగినప్పుడు, మనం కోపంతోనో, భయంతోనో లేదా మరేదో విధంగానో ప్రతిస్పందిస్తూ ఉంటాం. అలాంటప్పుడు వీలైనంత త్వరగా మనసును మరో విషయంపైకి మళ్ళించాలి. ఉదాహరణకు మనం వెంటనే లేచి మంచి నీళ్ళు తాగటం మొదలుపెడితే కోపం ఎక్కువవ్వటం జరగదు. మనసును ఆ విషయాన్నుంచి మళ్ళించగలుగుతాం. దానివల్ల కోపం తగ్గటం మొదలవుతుంది. లేదా ఒకటి, రెండు, మూడు, నాలుగు........ అంటూ లెక్కపెట్టాలి. అలా కాకుంటే మీకు నమ్మకమున్న ఏ దేవుడి పేరుగానీ, పుణ్య పురుషుని పేరుగానీ, పదాన్ని గానీ, మంత్రాన్ని గానీ జపించటం మొదలెట్టాలి. ఇలా చేస్తే మనసు ఆ వికారం నుండి మళ్ళించబడి, మీరు ఆ కోపం నుండి, ఆ వ్యతిరేక భావాల నుండి బయటపడటం జరుగుతుంది.

ఈ పరిష్కారం ఉపయోగకరంగానే వుండేది. ఇప్పుడు కూడా ఇలాంటి విధానాలు పనిచేస్తున్నవి. వీటిని సాధన చేస్తుంటే మనకు ఆందోళన దూరమైనట్లే అనిపిస్తుంది. కానీ, ఈ పరిష్కారాలు మనసు యొక్క చేతన స్థాయిలోనే పనిచేస్తాయి.వాస్తవంగా చూస్తే, మనసును ఇలా వికారాల నుండి మళ్లించటం వల్ల వాటిని మనసు యొక్క అచేతన స్థాయిలోకి తొక్కివేయడం జరిగి, అక్కడ మనం తిరిగి వికారాలు తయారుచేసుకొని, వృద్ధి చేసుకుంటూ పోతాము.పైపైన శా౦తిసామరస్యపు పొరలుంటాయి. అచేతన మనసులో ఆ వికారాలు నిద్రాణంగా ఉన్న అగ్ని పర్వతాల్లా ఉంటాయి. ఎప్పుడో ఒకప్పుడు ఇవి భయంకరంగా విస్ఫోటనం చెంది తీరుతాయి.

ఈ మనసు, శరీర తత్వాన్ని తమలోనే అనుభవపూర్వకంగా తెలుసుకుంటూ, ఈ అంతర సత్యాన్ని అన్వేషించిన మరికొందరు, తమ అన్వేషణలో ఇంకా ముందుకు సాగి - వికారాల నుండి మనసును మళ్ళించటమంటే అసలు సమస్యనుండి దూరంగా పారిపోవటమేనని గుర్తించారు. ఇలాంటి పలాయనం సమస్యకు పరిష్కారం కాజాలదు. సమస్యను నేరుగా ఎదుర్కోవాలి. ఎప్పుడైనా మనసులో వికారం ఉత్పన్నమైనప్పుడు దాన్ని కేవలం గమనించాలి, సూటిగా గమనించాలి. ఏదైనా మనోవికారాన్ని ఇలా గమనించడం మొదలుపెట్టగానే, దాని శక్తి క్షీణించటం మొదలవుతుంది. క్రమేణా అది సమసిపోతుంది.

ఇది ఒక మంచి పరిష్కారమే. ఇక్కడ వికారాలను అణచివేయటమూ లేదు, అలాగని స్వేచ్ఛగా వాటిని వ్యక్తపరచటం కూడా లేదు. రెండు అతి మార్గాలను వదిలి వేయటం జరిగింది. వికారాలను అచేతన మనసులోకి అణిచివేయడం ద్వారా వాటిని నిర్మూలించలేము. అలాగే ఈ వికారాలను చేతలు, మాటల ద్వారా వ్యక్తపరచటం ద్వారా కొత్త సమస్యలను సృష్టించుకున్నవారమవుతాం. కానీ, వాటిని కేవలం గమనించటం మాత్రమే చేస్తే, ఆ వికారాలు వాటికవే దూరమవుతాయి. మనం వాటి నుండి విముక్తులవుతాం.

వినడానికి ఇది అద్భుతంగా ఉంటుంది, కానీ ఇది సాధ్యమైన పనేనా? తమ తమ వికారాలను ఎదుర్కొనడం అంత సులువైన పని కాదు. కోపం వచ్చినప్పుడు, మనకు తెలియకుండానే నిమిషకాలంలోనే అది మనల్ని అధిగమించేస్తుంది. అప్పుడు కోపంలో ఊగిపోతున్న మనం మాటలతో, చేతలతో మనకు, ఇతరులకు హాని కలిగే పనులను చేస్తాము. తరువాత కోపం చల్లారిన తరువాత ఏడుస్తూ, పశ్చాత్తాప పడుతూ, "అయ్యో, నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి!" అని వారిని, వీరిని లేక భగవంతుణ్ణి క్షమాపణలు కోరుతూ కూర్చుంటాము. కానీ మళ్ళీ కోపం వచ్చినప్పుడు మళ్ళీ ఇదే విధంగా స్పందిస్తూ ఉంటాము. ఇలా నిరంతర పశ్చాత్తాపము వలన ఎటువంటి ఉపయోగమూ లేదు.

వచ్చిన చిక్కల్లా, ఈ వికారం కలిగినప్పుడు మనకు దాని స్పృహ ఉండదు. అది అంతర్మనస్సులోని లోలోతులలో పుడుతుంది, ఇక అది మనస్సు పై పొరలకు చేరే సరికి ఎంత బలాన్ని పొందుతుందంటే అది మనల్నే అధిగమించేస్తుంది, దాన్ని మనం గమనించ లేము.

పోనీ కోపం వచ్చినప్పుడల్లా "అయ్యా! కోపం మొదలయ్యింది!" అని చెప్పే ఒక వ్యక్తిగత కార్యదర్శిని నియమించుకుందామంటే? ఈ కోపం ఎప్పుడు వస్తుందో తెలియదు, అందుకని 3 పూటలకు ముగ్గుర్ని పెట్టుకోవాలి. సరే ఆ ఖర్చుని కూడా భరించగలను అనుకుందాం. ఇక కోపం రావడం మొదలయ్యింది, వెంటనే అతడు "చూడండి సార్ - కోపం వస్తుంది!" అని చెబుతాడు. అప్పుడు వెంటనే "మూర్ఖుడా! నాకే నేర్పిస్తావా నీవు, అందుకేనా నీకు జీతమిచ్చేది?" అని వాడికి గట్టిగా చివాట్లు పెడతాము. కోపంలో మునిగి ఉన్న వాళ్లకు మంచి సలహా ఇచ్చినా కూడా అర్థం కాదు , సహాయ పడదు.

ఒకవేళ కొంచం స్పృహలో ఉండి అలా చివాట్లు పెట్టే బదులు "చాలా ధన్యవాదాలు. ఇప్పుడు నేను కూర్చుని నా కోపాన్ని గమనించుకుంటాను" అని చెప్పి వెంటనే కళ్ళు మూసుకుని చూస్తే, కోపానికి కారణమైన ఆలంబనయే (ఆ వ్యక్తియో లేక సంఘటనయో) గుర్తుకొస్తుంది. అంటే నేను కోపాన్ని గమనించట్లేదు, కోపానికి కారణమైన బాహ్య ఆలంబననే గమనిస్తున్నాను. అప్పుడు ఆ కోపం ఇంకా పెరుగుతుందే కానీ తగ్గదు. అందువలన అది సమస్యకు పరిష్కారము కాలేదు. నిజానికి జననానికి కారణమైన ఆలంబనలను వేరు చేసి అమూర్త భావోద్వేగాలను, మలినాలను మాత్రమే గమనించడం చాలా కష్టం.

కానీ, పరమ సత్యాన్ని చేరుకున్న ఒక వ్యక్తి ఈ సమస్యకు నిజమైన పరిష్కారాన్ని కనుగొన్నాడు. మనస్సులో ఎటువంటి మలినాలు చెలరేగినా వెంటనే శరీర స్థాయిలో రెండు సంఘటనలు ఒకేమారు జరగడం ప్రారంభిస్తాయని ఆయన కనుగొన్నాడు.మొదటిది, శ్వాస. అది తన సహజత్వాన్ని కోల్పోతుంది. మనస్సులో వికారం తలెత్తగానే శ్వాస బరువుగా అవుతుంది. ఇది స్థూలమైన విషయం, పైకి స్పష్టంగా కనపడే మామూలు విషయం. దీన్ని అందరూ సులభంగా గమనించవచ్చు. ఇక రెండో సంఘటన సూక్ష్మస్థాయిలో శరీరంలో ఒక రకమైన జీవరసాయన క్రియ జరిగి, ఏదో ఒక సంవేదన కలగడం. ప్రతి మనోవికారం శరీరంలో ఏవో సంవేదనలను కలుగజేస్తూ ఉంటుంది.

ఇది ఒక ఆచరణాత్మక పరిష్కారాన్ని అందిస్తుంది. ఒక సామాన్య మానవుడు ఈ అమూర్త మనో వికారాలనూ, అమూర్త భయాన్ని, కోపాన్ని, ఆవేశాన్నీ పరిశీలించలేడు. కానీ సరియైన శిక్షణతోనూ, సాధనతోనూ మన మనోవికారాలతో నేరుగా సంబంధం ఉన్న శ్వాసను, సంవేదనలను గమనించడం చాలా తేలిక.

శ్వాస మరియు సంవేదనలు మనకు రెండు విధాలుగా తోడ్పడుతాయి. మొదటిది: అవి మనకు ఆంతరంగిక కార్యదర్శులుగా పనిజేస్తాయి. మనస్సులో ఏదైనా వికారం తలెత్తిన వెంటనే మన శ్వాస తన సహజత్వాన్ని కోల్పోతుంది. "చూడు!ఏదో తప్పు జరిగింది" అని హెచ్చరించటం మొదలెడుతుంది. అప్పుడు మనం మన శ్వాసను తిట్ట లేము కదా! శ్వాసను ఏమీ అనలేము. ఈ హెచ్చరికను స్వీకరించాల్సిందే. అలాగే సంవేదనలు కూడా "ఏదో తప్పు జరిగింది" అని మనకు హెచ్చరిక చేస్తాయి. ఈ హెచ్చరికను గూడా మనం స్వీకరించవలసిందే. ఈ హెచ్చరికతో శ్వాసను గమనించడం, సంవేదనలను చూడటం ప్రారంభిస్తాం. దానితో ఆ మనో వికారం తొలగిపోవటం చాలా త్వరగా చూస్తాం.

ఇలా మనో-శరీర తత్వాలు నాణానికి రెండు వైపుల లాంటివి. ఒకవైపు మనసులో ఏవో ఆలోచనలు, భావోద్వేగాలు ఉత్పన్నం అవుతున్నప్పుడు, మరోవైపు శ్వాస గమనంలో మార్పు, సంవేదనలు కూడా ఉత్పన్నమవుతూ ఉంటాయి. మన మనసులో ఏదైనా ఆలోచన, భావం, మనో వికారం కలిగినప్పుడు, ఆ క్షణంలో అవి, శ్వాస - సంవేదనల ద్వారా ప్రత్యక్షమవుతాయి. ఆవిధంగా శ్వాస మరియు సంవేదనలను గమనించడం ద్వారా మన మనో వికారాలను గమనిస్తాము.ఇక్కడ సమస్య నుండి పారిపోవటం లేదు, యదార్థాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఎదుర్కొంటున్నాం. ఫలితంగా ఆ వికారం బలహీనమయ్యేది తెలుసుకుంటాము. గతంలో మాదిరిగా మనల్ని ఆ వికారం లొ౦గదీసుకోవడం లేదు. కొంత కాలం ఇలాగే మనం ఉండ గలిగితే ఆ మనో వికారం చివరికి అదృశ్యమవుతుంది. దానితో ఎక్కువ మనో వికారాలు లేని జీవితం సుఖ శాంతులు తో జీవించగలుగుతాము.

ఈ విధంగా మనసు మనం గమనించుకునే ఈ పధ్ధతి, 'నిజాన్ని' దాని బాహ్య-అంతరంగిక రూపాలలో మనకు తెలియపరుస్తుంటుంది. ఇంతకు ముందు మనం కళ్ళతో బయటి విషయాలను మాత్రమే చూస్తూ, లోపలి సత్యాన్ని గమనించే వాళ్ళం కాదు. మన అశాంతికీ, దుఃఖనికీ కారణాన్ని బయటి ప్రపంచంలోనే వెతికే వాళ్ళం. మన దుః:ఖానికి బయటి కారణాలనే దూషిస్తూ, వాటినే సరిదిద్దుకోవటం చేసే వాళ్ళం. మనలో జరిగే ప్రతిస్పందనను మనం తెలుసుకునే వాళ్ళం కాదు కాబట్టి, దుః:ఖ కారణం మనలోనే ఉందన్న సత్యాన్ని తెలుసుకునే వాళ్ళం కాదు. ఈ విధంగా మనను మనం గమనించుకునే ఈ పధ్ధతి, ఉన్న నిజాన్ని దాని బాహ్య-అంతరంగిక రూపాలలో మనకు తెలియపరుస్తుంటుంది. ఇంతకు ముందు మనం బయటి విషయాలను మాత్రమే చూస్తూ, లోపలి సత్యాన్ని గమనించే వాళ్ళం కాదు. మన అశాంతికి కారణాన్ని బయటి ప్రపంచంలోనే వెతికే వాళ్ళం. మన దుః:ఖానికి బయటి కారణాలను తప్పుబడుతూ, బాహ్య సత్యాన్ని సరిదిద్దాలనుకోనేవాళ్ళం.అంతః సత్యం తెలియనందువల్ల సుఖ సంవేదనల మరియు దుఃఖసంవేదనల పట్ల మన౦ గుడ్డిగా ప్రతిస్పంది౦చడమే మనలో దుఃఖానికి కారణమని మనకి తెలిసేది కాదు.

ఇప్పుడు ఈ విపశ్యన ధ్యాన శిక్షణతో నాణెం అవతలివైపు గూడా చూడగలుగుతున్నాం. మన శ్వాసను తెలుసుకోగలుగుతూ మనలోపల ఏమేమి జరుగుతుందో తెలుసుకొంటున్నాం. శ్వాసనుగానీ, సంవేదననుగానీ, మనసు సంయమనం కోల్పోకుండా చూడటం నేర్చుకుంటున్నాం. ప్రతిక్రియ చేస్తూ. దుః:ఖాలను పెంచుకోవటం ఆపేశాము. దానికి బదులుగా ఇప్పుడు వికారాలు బయల్పడి తొలగిపోయేటట్లు చేస్తున్నాము.

ఈ సాధనను మనం ఎంత ఎక్కువగా చేస్తామో అంత వేగంగా వికారాలు కరిగి పోతాయి. క్రమేణా మనసు వికారాల నుండి ప్రక్షాళన చెందుతుంది, శుద్ధమవుతుంది. శుద్ధమైన మనసు ఎల్లప్పుడూ నిస్వార్థ ప్రేమతోనూ, కరుణతోనూ నిండి ఉంటుంది. ఇతరుల దుః:ఖాల పట్ల, వైఫల్యాలపట్ల కరుణతోనూ, వారి సుఖ సంతోషాలు, విజయాలపట్ల మోదముతోనూ,ఎటువంటి పరిస్థితి లోనైనా సమతుల్యతతోనూ నిండి ఉంటుంది.

ఈ దశకు చేరుకున్నవారి జీవన విధానం పూర్తిగా పరివర్తనం చెందటం మొదలవుతుంది. అప్పుడు తమ మాటలతో గానీ, చేతలతో గానీ ఇతరుల సుఖశాంతులను ఏ విధంగా కూడా భంగపరచటం వారికి సాధ్యంకాదు. అంతేగాక, వారి సమతుల్యత వారికి శాంతిని ఇవ్వటమే కాక, ఇతరుల శాంతికి కూడా దోహదపడుతుంది. వారి చుట్టూ పక్కల వాతావరణమంతా శాంతి సామరస్యాలతో నిండి ఇతరులను ప్రభావితం చేస్తూ ఇతరులకు సహాయ పడుతుంది.

లోపల అనుభవించేది ప్రతీది సమతతో ఎదుర్కోవడం నేర్చుకోవడం ద్వారా ప్రతి ఒక్కరు బాహ్య పరిస్థితులను కూడా ఎదుర్కొనడానికి తటస్థంగా ఉండటాన్ని పెంపొందించుకుంటారు. అయితే ఈ తటస్థత ప్రపంచ సమస్యల నుండి పలాయించడం లేదా ఉదాసీనంగా ఉండటం కాదు. విపశ్యనను క్రమం తప్పకుండ సాధన చేసే వారు, ఇతరుల బాధలను ఇంకా బాగా అర్థం చేసుకోగలరు మరియు వారికి బాధల నుండి ఉపశమనం కలిగించడానికి తాము చేయగలిగినది ఏమాత్రం ఆందోళన లేకుండా, మనస్పూర్తిగా, ప్రేమతో, కరుణతో, సమతతో చేస్తారు. వారు పవిత్ర తటస్థతను తెలుసుకుంటారు - పూర్తి నిబద్ధత తో ఎలా ఉండాలో తెలుసుకొని, ఇతరులకు సహాయం చేయడంలో పూర్తిగా నిమఘ్నమవుతారు. అదే సమయంలో మనసును కూడా సమతలో ఉంచుకుంటారు. ఈ విధంగా వారు ఇతరుల శాంతి సంతోషాల కోసం పని చేస్తూ తాము ఆనందంగా ప్రశాంతంగా ఉంటారు.

బుద్ధుడు దీనినే జీవనకళగా పేర్కొని అందరికీ బోధించాడు. ఏదో ఒక మతాన్ని గానీ, సిద్ధాంతాన్ని గానీ, ఆయన బోధించలేదు, ఏర్పరచలేదు కూడా. తన అనుచరులను ఏవో కర్మకాండలను,పనికి రాని సాంప్రదాయాలను పాటించమని గానీ, వాటిని గుడ్డిగా నమ్మమని గానీ బోధించలేదు. లోపలి యథార్థాన్ని యథాతథంగా చూస్తూ ప్రకృతిని పరిశీలించమని మాత్రమే ఆయన బోధించాడు.అజ్ఞానం వల్ల మనకు, ఇతరులకు కూడా హాని కలిగే విధంగా ప్రతిక్రియ చేస్తూఉంటాం. ఎప్పుడైతే జ్ఞానోదయం అవుతుందో యథార్థాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడగలిగే జ్ఞానం కలుగుతుందో అప్పుడు ఈ ప్రతిక్రియలు చేసే అలవాటు నుండి బయటపడతా౦. ఇలా గుడ్డిగా ప్రతిక్రియ చేయటం మానివేసినప్పుడు నిజమైన, నిర్మాణాత్మకమైన క్రియ చేయగలుగుతాం. అది సత్యాన్ని దర్శించి, అవగాహన చేసుకుని, సంతులిత, సమదృష్టి గల మనస్సుతో చేసే క్రియ.అటువ౦టి పని సకారత్మకమై, నిర్మాణాత్మకమై, మనకు మరియు ఇతరులకు సహాయపడేదిగా ఉంటుంది

అందువల్లే మనల్ని మనం తెలుసుకోవటం అవసరం. "నిన్ను నీవు తెలుసుకో" అనే సలహాను వివేకంగల ప్రతి వాడూ ఇస్తాడు. నిన్ను నీవు తెలుసుకోవటం అనేది బుద్ధి స్థాయిలో కాదు; భావాల, సిద్ధాంతాల స్థాయిలోనూ కాదు; భక్తితోనో, భావోద్రేకం తోనో కాదు; ఏదో విన్నదాన్ని, చదివిన దాన్ని గుడ్డిగా ఒప్పుకోవటం కాదు. దీనికి, ఇలాంటి జ్ఞానం సరిపోదు అని మనం తెలుసుకోవాలి. దీనిని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ప్రత్యక్షానుభవం ద్వారానే ఈ మానసిక-భౌతిక విషయాన్ని తెలుసుకోవడం ద్వారానే మన దుఃఖాల నుండి విముక్తులము అవగలుగుతాము.

మానవుడు తనను గురించిన లోపలి యథార్థాన్ని ప్రత్యక్షానుభూతితో చూడటాన్ని, తనను తాను పరిశీలించుకునే ఈ పధ్ధతినే విపశ్యన ధ్యానమంటారు. బుద్ధుని కాలపు భారతదేశ భాషలో "పస్సన" అంటే కళ్ళతో సాధారణంగా చూడటం.కానీ విపస్సన (విపశ్యన) అంటే ఉన్నది ఉన్నట్లుగా చూడటం; పైకి కనబడే విధంగా కాదు సుమా! ఈ మానసిక - భౌతిక క్షేత్రాల తుది సత్యాన్ని చేరుకునే వరకూ, పైకి కనబడే సత్యాన్ని ఛేదిస్తూ పోవాలి. ఈ సత్యాన్ని అనుభూతితో తెలుసుకున్న మనం గుడ్డిగా ప్రతిక్రియ చేయడం మానివేయటం ఎలాగో నేర్చుకుంటాము. కొత్తగా వికారాలు తయారుచేయడం ఆపేస్తాము. దానివల్ల సహజంగానే పాత మనోవికారాలు క్రమేపి తొలగిపోతాయి. మనం దుఃఖాల నుండి బయటపడతాము, నిజమైన ఆనందానుభూతి పొందుతాము.

విపశ్యన ధ్యాన శిక్షణలో మూడు మెట్లు ఉన్నాయి. మొదటిది - ఇతరుల సుఖ శాంతులకు అంతరాయం కలిగించే ఏ పనినీ మాటలతోగానీ, చేతలతో గానీ చేయకపోవటం. మనోవికారాలను పెంచే మాటలు కానీ, చేతలు కానీ కొనసాగుతున్నంత కాలం ఆ వికారాల నుండి విముక్తి పొందలేము. అందుకే ఈ సాధనలో నైతిక నియమావళి, శీలపాలన అనే మొదటి మెట్టు చాలా ముఖ్యం. హత్య చేయననీ, దొంగతనం చేయననీ, అక్రమలై౦గిక సంబంధాలు పెట్టుకోననీ, అసత్యం చెప్పననీ,మత్తు పదార్థాలు సేవించననీ నియమం పెట్టుకుంటారు. ఇటువంటి చర్యలకు దూరంగా ఉండటం వల్ల మనస్సు తగినంత శాంతపడి ఈ సాధన ముందుకు కొనసాగించటానికి వీలవుతుంది.

అడవి జంతువులా౦టి చంచలమైన మనసును శ్వాసపై స్థిర౦గా నిలపటం ద్వారా దాన్ని స్వాధీన పరచుకోవటం ఈ సాధనలో రెండవ మెట్టు. ఇందులో తమ శ్వాసపై మనసును వీలైనంతసేపు నిలపటానికి ప్రయత్నిస్తారు. ఇది ప్రాణాయామ అభ్యాసము కాదు. శ్వాసను క్రమబద్ధం చేయటం కూడా కాదు. సహజ శ్వాసను - యథావిధిగా గమనించటం. లోపలికి వచ్చే శ్వాసను, బయటికి వెళ్ళే శ్వాసను - ఉన్నది ఉన్నట్లుగా సహజంగా చూడటం. దీనితో, తీవ్రమైన వికారాల వశంలోకి వెళ్ళకుండా, మనసు శాంతించి, ఏకాగ్రం చెంది, చురుకుగా మనసు లోతులకు ప్రవేశించి అంతః సత్యాన్ని తెలుసుకునే సామర్థ్యం పొందుతుంది.

సాధనలో ఈ మొదటి రెండు దశలూ-నైతికంగా జీవించటం, మనోనిగ్రహం కలిగి ఉండటం, ఎంతో ఆవశ్యకము, లాభదాయకమైనవి. కానీ మన మనసు స్వభావాన్ని గమనించి ప్రజ్ఞతో దాన్ని ప్రక్షాళన చేసుకునే దశకు ఎదగకపోతే, ఈ మొదటి రెండు దశలూ వికారాల అణచివేతకు దారితీస్తాయి. ఈ మూడవ దశనే విపశ్యన అంటారు. మనలో ఎల్లప్పుడూ మారుతూ ఉండే భౌతిక-మానసికతత్వాలు సంవేదనల రూపంలో బహిర్గతం అవుతున్నప్పుడు సమతుల్యతతో, నిరాసక్తతతో గమనిస్తూ, మనలో నుండే ఈ యథార్థాన్ని ప్రత్యక్షానుభూతితో తెలుసుకోవటమే విపశ్యన. ఈ ఆచరణే బుద్ధుని శిక్షణలో అత్యున్నతమైనది. స్వయం పరిశీలన ద్వారా మనసును శుద్ధి చేసుకోవటం.

ప్రతి ఒక్కరూ ఈ సాధన చేయవచ్చు. దుఃఖం అందరికీ సమస్యే. ఇది ఒక సార్వజనీన సమస్య దీని నివారణోపాయం కూడా ఎదో ఒక వర్గం వారికే వర్తించే విధంగా కాకుండా సార్వజనీనంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ బాధకు లోనయ్యేవారే కదా! కోపంతో బాధపడుతున్నప్పుడు అది హిందూ కోపమని గానీ , క్రైస్తవ కోపమని గానీ, బౌద్ధ కోపమని గానీ ఉండదుగదా! కోపము కోపమే. దాని వల్ల దుః:ఖానికి లోనవుతుంటాం. అది హిందూ దుః:ఖము కాదు. క్రైస్తవ ద:ఖము కాదు, బౌద్ధ దుః:ఖము కాదు,మహమ్మదీయ దుఃఖ౦ కాదు. అందుకే ఈ సార్వజనీన వ్యాధికి సార్వజనీన చికిత్సే కావాలి.

ఇతరుల సుఖశాంతులను గౌరవించే ఈ జీవన నియమావళి పట్ల ఎవరికీ అభ్యంతరము ఉండదు. తమ మనసును స్వాధీనపరచుకోవటమంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. మనో వికారాల నుండి విముక్తి కోసం తమలోని యథార్థాన్ని చూడగలిగే శక్తిని పెంచుకోవటమన్నాకూడా ఎవరికీ అభ్యంతరం ఉండదు. విపశ్యన అటువంటి నివారణోపాయం. ఇది సార్వజనీన మార్గం.

యథార్థాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడటం ద్వారా లోపల సత్యాన్ని దర్శించటం అంటే మనను మనం వాస్తవిక స్థాయిలో, అనుభూతి స్థాయిలో తెలుసుకోవటం. సాధన చేస్తూ పోతే వికారాలు కలిగించే దుః:ఖము నుండి విముక్తి పొందుతాం. స్థూలమైన, బాహ్యమైన పైపై సత్యంతో మొదలుపెట్టి మనసు లోలోని అంతిమ సత్యంలోనికి ప్రవేశిస్తాం. ఈ స్థాయిని దాటిపోయి, ఎప్పుడైతే మనసు - రూపాలకు అతీతమైన(చిత్తానికి-శరీరానికి), కార్యకారణాలకు అతీతమైన(సంస్కరించబడిన, సంఘటితమైన), సమయానికి, భౌతిక ప్రపంచానికి అతీతమైన, సత్యాన్ని అనుభూతితో తెలుసుకుంటామో అప్పుడు మనోవికారాల నుండి, కల్మషాల నుండీ, దుః:ఖాల నుండీ సంపూర్ణ విముక్తిని ప్రసాదించే సత్యాన్ని గ్రహిస్తాం. ఈ పరమసత్యాన్ని ఏ పేరుతో పిలుస్తామన్నది ముఖ్యం కాదు. ఇదే ప్రతి ఒక్కరి అంతిమ లక్ష్యం.

మీరందరూ ఈ పరమ సత్యానుభూతిని పొందుదురు గాక! సర్వప్రాణులూ తమ తమ దుః:ఖాల నుండి విముక్తి పొందుదురు గాక! సకల ప్రాణులూ నిజమైన ఆనందాన్ని, నిజమైన శాంతినీ, నిజమైన సామరస్యాన్నీ అనుభవించుదురుగాక!

భవతు సర్వ మంగళం